ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండల కేంద్రంలోని శ్రీ వేద భారతి పీఠంలో గురువారం ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు స్వస్తి వాచనం, రాజ్యాధికార హోమం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, ఆయన నాయకత్వంలో దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రధానికి వేదాశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా వేద విద్యానంద స్వామీజీ మాట్లాడుతూ వేదం భారతీయ సంస్కృతికి మూలాధారమని అన్నారు. వేద మంత్రాలతో నిర్వహించే హోమాలు వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు లోకకల్యాణం, ప్రకృతి సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. వేద సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారు.
వేదాలను నిత్యం పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెంపొందుతాయని స్వామీజీ పేర్కొన్నారు. యువత వేద విద్యను అభ్యసించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వేద పాఠశాల విద్యార్థులు, వైదిక గురువులు, పీఠం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.











